7

ఓటమిని ఓడించిన వైకల్యం

Labels: ,



మనం అందరం సాధారణ మనుష్యులం... కోపం, ప్రేమ, బాధ, ఈర్ష్య, జాలి, కష్టం, ఇష్టం, సంతోషం, దు:ఖం లంటి ఎన్నో ఉద్రేకాలు కలిగిన మనస్తత్వాలు మనవి...

మన ఈ జీవితప్రయాణంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాము.. కాని ఎప్పుడైనా ఒక అవిటివాడినో లేక శారీరక లోపాలు ఉన్నవారినో కలిసినప్పుడు మాత్రం వారి మీద మనకు ముందు కలిగేది "జాలి".. అది సహజం.. నేను కూడా అలాగే ఉండేవాడిని..

కానీ నా ఈ ప్రయాణంలో ప్రత్యేక్షంగా మరియు పరోక్షంగా పుట్టుకతో లేదా ప్రమాదవశాత్తు అవయువాలు కోల్పోయిన కొంతమందిని కలిసాను.. వాళ్ళని కలిసిన తరువాత వాళ్ళకి కావలసింది ఏంటో తెలుసుకున్నాను, వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసుకున్నాను... వాళ్ళ మీద "జాలి" చూపించడం మానేసాను... ఎందుకంటే వాళ్ళు కోరుకునేది "ప్రోత్సాహం" కాని "ఓదార్పు" కాదు..


ఇక్కడ నా మనసుని కదిలించిన కొన్ని సంఘటనలు ప్రస్తావిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇవి చదివిన మీలో ఈ సంఘటనలు ఒక్కరి మనసునైన కదిలిస్తుందెమో అని ఆశ... కదిలిన మనసులలో ఒక్క మనసైన మారుతుందేమో అని అత్యాశ....

అతను ఆషిష్ గోయల్ కాదు ఆదర్శ్ గోయల్:

కొన్ని ఏళ్ళ క్రితం లో ఒక పెద్ద కార్పరేట్ సంస్థ ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తు ఇంటర్వ్యూకి వచ్చిన ఆషిష్ గోయల్ అనే వ్యక్తితో ప్రభుత్వ పరిధిలో అంధుల కోటాలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించమని చెప్పింది. ఎందుకంటే ఆషిష్ కొన్ని ఏళ్ళ క్రితం "రెటినిటిస్ పిగ్మెంటోసా" అనే వ్యాధి వలన తన చూపు కోల్పోయాడు... కాని అతను ఆ సంస్థ ఇచ్చిన ఉచిత సలహా ని తక్కువగా తీసుకోలేదు... ING Vysya లో ఉద్యోగం సంపాదించడమే కాక తన బ్యాచ్ లోనే రెండవ స్తానంలో నిలిచాడు... ఆ తరువాత వార్టన్ స్కూల్, యూనివర్సిటి ఆఫ్ పెన్సిల్వనియ, ఫిలడెల్ఫియా నుంచి MBA పట్టా పొందాడు..


ఈరోజు ఈ ముంబయి వాసి జె.పి.మార్గన్, లండన్ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు...

కొన్ని ఏళ్ళుగా వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎన్నో గొప్ప పనులు చేసాడు. ఇష్టంతో "బ్రెజిలియన్ డ్రమ్స్" నేర్చుకున్నాడు, వాయిస్తాడు. ఇప్పుడు "అర్జెంటినో టంగో" నుంచి "బాక్సింగ్" వరకు తనకి ఇష్తమైన కళలు అన్నీ నేర్చుకుంటున్నాడు.

2010 లో జాతీయ అవార్డ్ అందుకోవటానికి గాను భారత దేశానికి వచ్చిన ఆషిష్ ని ఒక వెబ్ సైట్ యజమాని లజ్వంతి డిసౌజా పలకరించినప్పుడు తన గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు చెప్పాడు ఆషిష్.

తనకి వచ్చిన జాతీయ అవార్డ్ తనకు చాలా ఉత్సాహం ఇచ్చిందని చెప్తూ రాష్ట్రపతి చేతుల మీద అవార్డ్ అందుకోవడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రోత్సాహం అనేది ఎవరికైనా సరే అద్భుతాలు సృష్టించే శక్తి ఇస్తుందని నమ్ముతున్నానని చెప్పారు.

"మేము జీవితం అనే ఆటలో ఎంతో కోల్పోయాం, ఇలాంటి అవార్డ్ వల్ల తిరిగి మేము ఒక అడుగు ముందుకు వేయడానికి సహాయ పడుతుంది. ఇలాంటి గుర్తింపు పొందినందుకు ఈ సందర్భంగా భగవంతుడికి కృతఘ్నతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి గుర్తింపు మనిషిలో ఉత్తేజం నింపుతుంది. అంతేకాకుండా, ఇలాంటి అవార్డ్ అవిటివాళ్ళ మీద సమాజానికి వుండే అభిప్రాయం మర్చగలిగితే అంతే చాలు" అన్నారు.

అంతేకాకుండా "Enable India" అనే సంస్థ ద్వారా అతను సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. "Education through Pratham", "Akshaya Pathra" అనే మరో రెండు పథకాలు ద్వారా కూడా తను సేవలు అందిస్తున్నాడు.

అందుకే ఆషిష్ గోయల్ ఎంతో మందికి ఆదర్స్ గోయల్ అయ్యాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే...

సురేష్ ప్రజాపతి - సహా:యానికి నిధి:

కొన్ని ఏళ్ళ క్రితం అహ్మదాబాద్ లో జరిగిన ఒక జాబ్ ఫెయిర్ లో అభ్యర్ధులుతో మాట్లాడిన తరువాత బయటకి వచ్చిన అధికారి ఒక అంధుడు అక్కడ కూర్చోటానికి చోటు కోసం వెతుక్కుండటం చూసాడు. ఆ అంధుడి పేరు సురేష్ ప్రజాపతి. పరీక్ష అయ్యిపోయిందా అని అడిగిన అధికారి ప్రశ్నకు సమాధానంగా "లేదు. నేను నా స్నేహితుడితో ఇక్కడికి వచ్చాను" అని గట్టి నమ్మకంగా చెప్పాడు. ఓహో అయితే నీ స్నేహితుడు నిన్ను తీసుకుని నీకోసం వచ్చాడా? అని అడిగిన అధికారి సురేష్ ఇచ్చిన సమాధానం కి ఆశ్చర్యపోయాడు. "లేదు. నేను ఇంతకు ముందే ఇక్కడ నమోదు చేసుకున్నాను. మాది విరంగం పక్కనే మండలం అనే గ్రామం. నా స్నేహితుడికి అహ్మదాబాద్ గురించి పెద్దగా తెలియదు. కాబట్టి నా స్నేహితుడు తనని ఇక్కదికి తీసుకుని రమ్మని నన్ను కోరాడు. అతనికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను" అని మల్లి అదే నమ్మకం తో చెప్పాడు.


ఆ సమాధానం విని ఆశ్చర్య పోయిన అధికారి ఏదైనా సంస్థలో పని చేస్తున్నావా? అని అదిగిన ప్రశ్నకు "నేను టెలిఫోన్ బూత్ నడిపేవాడిని, కాని ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉండటం వల్ల వేరే కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఎన్నో సంస్థలకి తిరిగాను కాని ఎక్కడ ఉద్యోగం దొరకలేదు" అని మొదటిసారి కొద్దిగా అధైర్యత చూపించాడు.

నువ్వు ఏమి ఉద్యోగం చేయగలవు? అని అధికారి అడిగిన ప్రశ్నకు "టెలిఫోన్ ఆపరేటర్ గా చేయగలను, గుజరాత్ రాష్ట్రంలో ఒంటరిగా ఎక్కడికి అయినా వెళ్ళగలను. పిల్లలకు పాఠాలు చెప్పగలను, ముఖ్యంగా నేను ఏమైనా నేర్చుకోగలను" అని చెప్పాడు. నిజంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడిన సమాధానం అది. ఆ తరువాత అతను కోరుకున్నట్టుగా అతనికి మంచి ఉద్యోగం లభించింది.

సామాన్య వనిత ఈ జెన్నిత:



తిరుచ్చి, తమిళనాడు లో జన్మించిన ఈమె పుట్టుకతోనే శారీరక లోపాలతో జన్మించింది. అలా అని తనకు లోపాలు వున్నాయి అని ఏ రోజు కృంగిపోలేదు. తనలో ఉన్న శక్తిని తెలుసుకుని ఆమె తండ్రి, ఇరుదయరాజ్ ప్రోత్సహించాడు. అవిటివాళ్ళు అయిన గొప్ప మేధావుల కథలు వినిపించాడు. ఆమెను ప్రోత్సహించాడు. "చదరంగం" మీద తనకి ఉన్న ఆశక్తిని తెలుసుకున్నాడు. ఆమె ఇష్టాన్ని, ఆశయాన్ని తెలుసుకుని విశ్వవిఖ్యాతగా పేరుగాంచిన రాజు రవిశేఖర్ ఆమెను తీర్చిదిద్దాడు. ఈరోజు ఆమె చదరంగం ఆటలో ఎన్నో విజయాలను అందుకుంది. పోలండ్ లో నిర్వహించిన అంతర్జాతీయ చదరంగం పోటీలో వెండి పథకాన్ని గెలుచుకుంది. ఇలా ఎన్నో మైలురాళ్ళు దాటిన ఆమెను తన విజయాల రహస్యం ఏమిటని అడిగితే "విజయం, అపజయం అనేవి మన మనసులోనే ఉంటాయి. నేను మొదటిసారి చదరంగం పోటీలో పాల్గొనిన రోజు నాకు ఇంకా గుర్తు ఉంది. ఆరోజు నాలో వణుకుని నేను చూసాను. వేలమంది ప్రేక్షకులు నన్నే చూస్తున్నారు. వీల్ చైర్ లో వచ్చిన నన్ను చూసి వారంతా మనసులో ఏమనుకుంటున్నారు అని ఆలోచించిన క్షణం నాకు ఇంకా గుర్తు ఉంది. కాని ఆరోజు ఆట గెలిచిన తరువాత ఈరోజు వరకు నేను అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను" అని ప్రకాశవంతమైన చిరునవ్వుతో చెప్పింది.

విజేతగా నిలిచిన సుజాత:

ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఈమె షిరిడి నుండి తిరిగి వస్తుంటే 2001 లో ప్రమాదానికి గురి అయ్యింది. ఆ ప్రమాదంలో తను చేతులు, కాళ్ళు కోల్పోయింది. నాలుగు నెలలు తరువాత ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె ఇంక జీవితకాలం నడవలేదు అని తేల్చి చెప్పారు. ఆమె భుజాల కింద చలనం కోల్పోయింది. ఆ తరువాత ఆమె కొన్ని రోజులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది. అప్పటికి ఆమె వయసు 21. ఆమె స్నేహితులు అనుకున్న వారంతా ఆమెను ఒంటరి దానిని చేసారు. విధి చాలా విచిత్రమైనది. ఆమె బాధకు మరింత బాధను జత చేసింది. 2004 లో తోడుగా నిలుస్తాడు అనుకున్న ఆమె తండ్రి కూడా మరణించాడు. దానితో ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. బాధ ని బాధతో ఎన్ని సార్లు గుణించిన ఆమె పడే బాధకు తక్కువే అవుతుంది. ఆ బాధలోనే ఆమెకు ఆత్మ విశ్వాసం పెరిగింది. స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకుంది. ఆమె తెలివితో ఈరోజు ఆమె నెలకు సుమారు మూడు లక్షలు సంపాదిస్తోంది. ఆమె నిఫ్టీ ద్వారా ఒక రోజు ఆరు లక్షలు సంపాదించిన ఎకైక వ్యపారవేత్త.



అంతే కాదు ప్రముఖ టీవి ఛానెల్ లో ఈ సుజాత అలియాస్ సుజి అనే మహిళ "suzy's encounter" అనే కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరిస్తుంది. మీ విజయంలో కీలక పాత్ర మీ కుటుంబానిదా?? స్నేహితులదా?? అని అడిగిన ప్రశ్నకు "నా తండ్రి కొన్ని ఏళ్ళ క్రితమే మరణించారు. నేను నా తల్లితో ఉంటున్నాను. ప్రమాదానికి ముందు నన్ను ఆధరించిన స్నేహితులు ప్రమాదానికి తరువాత నన్ను వెలేశారు. వాళ్ళు నిజమైన స్నేహితులు కారు. అలాంటి వాళ్ళు డబ్బు, హోదా, సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారు. అలాంటి వాళ్ళు ఓటమికి ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు నాకు కొత్త స్నేహితులు దొరికారు. వాళ్ళు చల కొద్ది మందే అయినా నిజమైన స్నేహితులు. కష్టకాలంలో నా వెన్నంటే వున్నారు. వాళ్ళు నాకోసం ఆలొచించే వాళ్ళు" అని ఆమెలోని ఆవేదన బయటపెట్టింది.

పుట్టుకతో పోలియో - సాధించినవి ఎన్నో:

ఇది నా ప్రత్యేక్ష అనుభవం. నాలుగేళ్ళ క్రితం బెంగళూరు లోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహించిన సమావేసానికి (conference) నేను హాజరయ్యాను. సమయం గడిచిపోతున్నా సమావేసం మొదలపెట్టని యాజమన్యాన్ని పై కోప్పడ్డాను. కొన్ని నిమిషాల తరువత సమావేసం మొదలుపెట్టాల్సిన వ్యక్తిని ఇద్దరు వ్యక్తుల సహాయంతో సమావేస గదికి తీసుకుని వచ్చారు. అతనిని చూసి అనవసరంగా కొప్పడ్డాను అని బాధపడ్డాను. అతను ప్రసంగించడం మొదలుపెట్టిన పది క్షణాలకే అతను మాట్లాడేది ఆశక్తిగా వింటున్నాను. అతను పుట్టింది ఆంధ్రప్రదేశ్, అతనికి పుట్టుకతోనే పోలియో ఉంది. అతనిది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. ఎన్నో కష్టాలతో, చదువంటే ఇష్టంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని ఈరోజు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి డైరెక్టర్ హోదాని అందుకున్నాడు. అతనే వి.వి.రవీందర్. 2004 లో తమిళనాడులో సంభవించిన సునామి కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడిచారు. సముద్ర తీరాల్లో నివసిస్తూ ప్రాంతీయ బాష తప్ప వేరే బాష తెలియకపోవడం కూడా ఒక శాపం లాంటిదే అని భావించాడు. దానితో చలిమ్చిన అతని మనసు ఒక ప్రాజెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించాడు. అదే మెస్సేజింగ్ సర్వీస్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. అవును. జి.ఎమ్.ఎస్ సృష్టికర్త అతను. కొంతసేపటికి అతను ప్రసంగించటం మొదలుపెట్టాడు. అతని ప్రసంగంలో చోటు చేసుకున్న కొన్ని ఆశక్తికరమైన అంశాలు.. "నాది సాధారణ రైతు కుటుంబం. పుట్తుకతోనే అవిటివాడిగా పుట్టిన నన్ను చిన్నపటి నుండి అలాగే చూసారు. అంటే అపురూపంగా చూసారు అని దాని అర్ధం. వాళ్ళు చూపించిన ఆ అపురూపంలో నేను ఎన్నో చూసాను. నేను ఏమైపోతానో అనే భయం కనిపించేది. వాళ్ళ మాటల్లో నా మీద ప్రేమ ఎలా ఉన్నా జాలి కనిపించేది. వాళ్ళ కళ్ళల్లో నేను ఏమీ చేయలేను అనే నిరాశ కనిపించేది. నన్ను చదువు ఆపేయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయినా కాని నేను వినలేదు. అందరినీ ఇబ్బంది పెట్టాను. నన్ను కాలేజ్ కి తీసుకుని వెళ్ళడానికి వారి పనులు మానాల్సి వచ్చేది. ఇలా ఎన్నో అవస్తలు పడ్డాను. చివరికి ఈరోజు ఇలా ఉన్నాను. ఆరోజు నన్ను చూసి జాలి పడిన కన్నీరు కార్చిన అవే కాళ్ళు ఈరోజు నన్ను చూసి గర్వంతో ఆనందబాష్పాలు కారుస్తున్నాయి. ఎవరో నన్ను చూసి జలి పడాలి అని కొరుకోలేదు. నన్ను చూసి గర్వపడాలి అని కోరుకున్నాను" ఆ మాటలు విన్న నాలో ఏదో తెలియని గర్వం. ఒక గొప్ప వ్యక్తిని కలిసాను అని అనందంతో పొంగిపోయాను.

టీచర్ నేర్పిన పాఠం:

సరిగ్గా పది ఏళ్ళ క్రితం సంగతి ఇది. నేను హై-స్కూల్ విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో సురేష్ అనే అధ్యాపకుడు పరిచయం అయ్యారు. ఆయన పుట్టిన మూడు ఏళ్ళ వయసు నుండి పోలియోతో బాధపడుతున్నారు. చాలా తక్కువ రోజుల్లోనే ఒక గురువు - విధ్యార్థి అనే బంధాన్ని దాటి మంచి స్నేహితులం అయ్యాము. అనుకోకుండా ఒక రోజు ఆయన నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆరోజు నేను ఎప్పటికి మర్చిపొలేను. ఆ ఇంటికి వెళ్లిన నేను అక్కడి వాతావరణం చూసి కొన్ని క్షణాలు మూగబోయాను. మనమెక్కడో వింటూ ఉంటాం "సినిమా కష్టాలు" అని. నిజంగా ఆయన కుటుంబాన్ని చూస్తే కంట తడి పెట్టని వాడు ఉండడు. ఏమి చేయలేని స్థితిలో వున్న తండ్రి. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న తల్లి. చదువుకోవాల్సిన వయసులో ఉన్న తమ్ముడు. అది చూసి అయనని నేను అడిగాను. "మీరు డిగ్రీ ఎలా చదివారు??" అని. దానికి ఆయన నుంది వచ్చిన సమాధానం ఇంకా న చెవిలో మారుమ్రోగుతుంది. "చదువంటే నాకు ఇష్టం హర్ష. ఆ ఇష్టంతోనే చదుకున్నాను. నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా ఇష్టానికి అడ్డు చెప్పలేదు. నా ఇష్టాలని గౌరవించేవాళ్ళు. నన్ను ప్రోత్సహింహింది నా తల్లే. పగలంతా చదువుకుంటూ, రాత్రంతా భూస్వాముల భుములకి కాపలా కాస్తూ, తెల్లవారు ఝమునే పాలేరుతనం చేస్తూ ఇదిగో ఇలా ఉన్నాను. మనకి ఏదో దేవుడు ఇవ్వలేదు అని బధపడకూడదు హర్ష. మనకు ఇచ్చినదానినే ఆయుధంగా మార్చుకుని లేనిదానిని సంపాదించుకోవాలి. అందరికి అన్నీ ఇచ్చేస్తే మనిషి దేవుదిని లెక్క చేయడు హర్ష. అందుకే ప్రతీ మనిషికి ఏదో ఒక లోపం పెడతాడు. తల్లి తండ్రి లేకపోవటమో, పిల్లలు లేకపోవటమో, డబ్బు లెకపోవటమో, అవయువాలు లేకపోవటమో. కాని అత్యంత బాధాకరం అయినది ఏంటో తెలుసా?? మంచి బుద్ధి, మనసు లేకపోవటం. నిజంగా బాధపడాల్సింది వీళ్ళే"

నిజంగా ఆరోజు ఆ మాటలు నన్ను కదిలించాయి. నిజమైన అవిటితనం అంటే ఏంటో అర్ధం చేసుకున్నాను.

ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్న విషయాలు రెండు...

ఇక్కడ నేను మాట్లాడేది శారీరక అవిటివాళ్ళ గురించి కాదు. మానసికంగా అవిటితనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఉద్ధేసించి మాట్లాడుతున్నా. నిజమైన అవిటితనం అనేది మనసుకి కాని శరీరానికి కాదు. మానసిక శక్తి లేని ప్రతీ వ్యక్తి అవిటివాడే. నేను చేయలేను అనుకుని ముందే ఓడిపోతున్నావు. నీలోని బలహీనతే నిన్ను ఓడిస్తుంది. ఎవరో ఏదో చెప్పారని అది చెయ్యకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. చేసే పని ఏదైన ఇష్టపడి చెయ్యి. కష్టపడి చేసే పనిలో గెలుపు ఒక్కటే ఉంటుంది కాని ఇష్టపడి చేసే పనిలో గెలుపుతో పాటూ తృప్తి ఉంటుంది. ఒకరితో పోల్చుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు చులకన చేసుకుంటున్నావు అని అర్ధం. నీకు నువ్వే పోటీ. నీతో నువ్వే పోటీపడు. లోపమే లేని మనిషే లేడు. జీవితంలో విజేతగా నిలబడటానికి కావలసింది మానసిక శక్తి (willpower) మత్రమే అని నిరూపించారు ఏంతోమంది. నీలో వున్న లోపాన్ని నీలో కసిని పెంచే పెట్టుబడిగా మలుచుకో. ఇప్పుడు నువ్వు గెలిచేవి ఓడేవి అన్నీ చాలా చిన్నవి. కాబట్టి గెలుపు - ఓటమి గురించి మర్చిపో. అంతిమంగా నువ్వు గెలవాల్సింది జీవితం అనే యుద్ధంలో. చీకటి లేకపొతే వెలుగుకి విలువ లేదు. బాధ అనేది లేకపోతే సంతోషానికి విలువ లేదు. అలాగే ఓటమి అనేది లేకపొతే గెలుపుకి విలువ లేదు. నీకు వచ్చిన ప్రతీ ఓటమిని అంతిమ గెలుపుకి ఒక పునాది రాయిగా మలుచుకో.

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..." అన్నాడు ఓ మహాకవి.

నీకోసం ఎవ్వరు రారు. ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి బ్రతుకుబండిని వాళ్ళు లాగాలి. నీకు నువ్వే. నువ్వు ఒంటరి వాడివే అనుకుని చేసేది చెయ్యి. నీ జీవితం నీది.

ఇక నేను చెప్పాలి అనుకునే రెండవ విషయం.

"మానవసేవే మధవసేవ" అన్నాది మదర్ ధెరెస్సా...

ఈ రోజుల్లో ఎవరి జీవితం వాళ్ళది అయ్యిపోయింది. మానవత్వం అనేది మర్చిపోయి మనుషులమనే అర్ధాన్నే మార్చేస్తున్నాం. యంత్రాల్లాగ మారిపోతున్నాం. సహాయం అనేదానికి అర్ధం పుస్తకాల్లో చదువుకుని వెతుక్కోవాల్సిన స్థితికి దిగజారిపోతున్నాం. అసలు మన తరువాతి తరం వాళ్ళకి సహాయం అనే పదమే కనపడకుండా చేసేస్తున్నాం.

తన స్నేహితుడి కోసం అంధుడు అయినా కూడా సహాయం చేసిన సురేష్ ప్రజాపతిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి???

అంధుదు అయిన కూడా తనలాంటి వికలాంగులు కోసం ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఆషిష్ గోయల్ ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి???

చేతనైన సహాయం చేయడనికి కూడా చేతులు రావడం లేదు మనకి.

ఇదే నిజమైన అవిటితనం అంటే. కష్టకాలంలో ఉన్న ఒక మనిషిని ఆదుకోలేకపోయిన ప్రతీ మనిషి అవిటివాడే. వాళ్ళ మనసులు కుంటిపడిపోయాయి. మనలో 98% మంది మానవత్వంగా వికలంగులము అయ్యిపోయాము. నివారించే మందేలేని మానసిక రోగంతో బాధపడుతున్నాము. అందుకే శారీరక వికలాంగులుని చూసి బాధపడటం మానేసాను. నిజంగా మనం చూసి బాధపడాల్సింది వీళ్లని. అందుకే సహాయం చేసే మనస్తత్వం లేని ప్రతీ వికలాంగుడిని చూసి నేను జాలి పడతాను.

సేవ చేయటానికి ఎన్నో సంస్థలు పుట్టుకుని వచ్చాయి. ఎన్నో సంస్థలు ఎంతో చక్కగా సేవా కర్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరెన్నో సంస్థలు మొదట్లో బాగానే చేసినా మెల్లిగా అవినీతిలో కూరుకుపోయాయి. ఇక్కడ సేవ అనేది సంస్థకి సంభందించినది కాదు. ప్రతీ వ్యక్తిలోనూ సేవ చేయాలి అనే ధృక్పతం కలగాలి. అవిటితనంతో కుంటిపడిపోయిన మన మనసులు మారాలి. వ్యక్తిగతంగా అయినా సరే సేవ చేసే గొప్ప మనసు మనలో రావాలి.

అందుకే నా దృష్టిలో శారీరక లోపాలు ఉన్న ఏ ఒక్కరూ అవిటివారు కారు...

అనుకున్నది చేయడానికి కావల్సిన మానసిక శక్తి (willpower) లేని ప్రతీ వ్యక్తీ అవిటివాడే...

ఆపదలో "అన్నా" అని సహాయం కోరి వచ్చిన వాళ్ళని పట్టించుకోని ప్రతీ ఒక్కడూ అవిటివాడే...

ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా ఒక్క మాటలో ముగిస్తాను...


"ఒకరి అవిటితనం ని బాగుచేయగలిగే శక్తి నీకు లేనప్పుడు... అతనిని చూసి జాలి పడే హక్కు కూడా నీకు లేదు..
కాని అతని భవిష్యత్తుకి ఉడుత సహాయం చేసి గోరంత ప్రోత్సాహం ఇచ్చే మనసు నీకు ఉంటే... ఎన్నో శిఖరాలను దాటే కొండంత బలం అతనిలో ఉంది.."


This is My theory.., And it is called to be...

HARSHAS THEORY

Note: Please feel free to give your comments/feedback about the post / blog here itself. Also tweet this or share this if you like this theory via twitter or facebook respectively.
- Harsha